దేశంలో కొవిడ్ విజృంభణ కారణంగా కొన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కుబేరుల సంపద మాత్రం భారీగా పెరుగుతోంది. దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఉన్న గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం సంపద విలువ గత ఏడాదిలో ఏకంగా 261శాతం పెరిగింది.
అదానీ, ఆయన కుటుంబం సంపాదన రోజువారీగా వెయ్యి కోట్లు (రూ.1002 కోట్లు) పెరిగిందని ఐఐఎఫ్ఎల్ వెల్త్-హురున్ (IIFL Wealth-Hurun India Report 2021) నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా తొలిసారి అదానీ సోదరులిద్దరూ ఈ జాబితాలో టాప్-10లో నిలిచారు.
ఇక దేశంలో అత్యంత సంపన్నుడిగా ఉన్న ముకేశ్ అంబానీ గతేడాదిలో రోజువారీగా రూ.169 కోట్లు మాత్రమే వృద్ధి చెందడం గమనార్హం.
దేశంలో అపర కుబేరుడిగా ఉన్న రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ గతేడాది 9శాతం పెరిగి రూ.7,18,000 కోట్లకు చేరుకుంది. రోజువారీగా ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ రూ.163 కోట్లు పెరుగుతున్నట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక వెల్లడించింది.
గతేడాది రూ.1,40,200 కోట్లుగా ఉన్న గౌతమ్ అదానీ కుటుంబం ఆస్తుల విలువ.. ప్రస్తుతం రూ.5లక్షల కోట్లకు చేరుకుంది. రోజువారీగా ఆ కుటుంబం సంపద విలువ రూ.వెయ్యి కోట్లు పెరుగుతోంది. ఇలా ఏడాది కాలంలోనే వారి సంపద ఏకంగా 261శాతం పెరగడం విశేషం. దీంతో దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ కుటుంబం రెండో స్థానానికి చేరుకుందని ఐఐఎఫ్ఎల్ నివేదిక తెలిపింది.
హెచ్సీఎల్ గ్రూప్ అధినేత శివనాడార్, ఆయన కుటుంబం సంపద విలువ కూడా భారీగానే పెరిగింది. గతేడాదితో పోలిస్తే వారి సంపద విలువ 67శాతం పెరిగినట్లు తాజా నివేదిక పేర్కొంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక ప్రకారం వారి సంపద నిత్యం రూ.260 కోట్లు పెరుగుతోంది. దేశంలో కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న వారి ఆస్తుల విలువ రూ. 2,36,000 కోట్లుగా ఉంది.
హిందూజా సంస్థల గ్రూప్ అధినేత ఎస్పీ హిందూజా కుటుంబం ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. రోజువారీగా వారి సంపద రూ.209 కోట్లు పెరుగుతుండగా.. గతేడాదిలో వారి ఆస్తుల విలువ 53శాతం పెరిగింది. దీంతో హిందూజా కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 2,20,000 కోట్లకు చేరుకుంది.
దేశంలో అత్యంత ధనవంతుల్లో ఐదో స్థానంలో మిత్తల్ కుటుంబం నిలిచింది. లక్ష్మీనివాస్ మిత్తల్తో పాటు ఆయన కుటుంబం ఆస్తుల విలువ రూ.1,74,000 కోట్లు కాగా గతేడాది వారి సంపదలో 187శాతం పెరుగుదల కనిపించింది. వారి కుటుంబం రోజువారీ సంపద వృద్ధి రూ.312కోట్లుగా ఉంది.
వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా కుటుంబం ఆస్తుల విలువ గతేడాది 74శాతం పెరిగింది. రోజువారీగా వారి ఆస్తులు రూ.190 కోట్లు పెరుగుతుండగా.. మొత్తం విలువ రూ.1,63,700 కోట్లకు చేరుకుంది. దీంతో దేశంలో అత్యంత ధనవంతుల్లో ఆరో స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో ఏడో స్థానంలో అవెన్యూ సూపర్ మార్కెట్ సంస్థల యజమాని రాధాకిషన్ దమానీ నిలిచారు. గతేడాదిలో వీరి ఆస్తుల విలువ 77శాతం పెరిగి రూ.1,54,300 కోట్లకు చేరుకుంది. రోజువారీగా వీరి సంపద రూ.184 కోట్లు పెరుగుతోంది.
గౌతమ్ అదానీ సోదరుడైన వినోద్ శాంతిలాల్ అదానీ కుటుంబం ఆస్తులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. గతేడాదిలో వీరి సంపద 212శాతం పెరిగింది. రోజువారీగా రూ.245 కోట్లు వృద్ధి ఉండగా.. మొత్తం ఆస్తుల విలువ రూ. 1,31,600కోట్లకు చేరుకుంది. గౌతమ్ అదానీ సోదరుడి కుటుంబం దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన కుమార్ మంగళం బిర్లా కుటుంబం ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. వీరి రోజువారీ సంపద రూ.242కోట్లు పెరుగుతోంది. వారి ఆస్తుల మొత్తం విలువ రూ. 1,22,200 కోట్లకు చేరుకుంది. గతేడాది వీరి సంపదలో ఏకంగా 230శాతం వృద్ధి కనిపించింది.
ఐఐఎఫ్ఎల్ నివేదిక ప్రకారం, పదో స్థానంలో స్కాలర్ గ్రూపు అధినేత జయ్ ఛౌదురి నిలిచారు. గతేడాది ఆయన సంపదలో 85శాతం వృద్ధి చెందింది. రోజువారీగా వారి ఆదాయం రూ.153కోట్లు పెరిగి.. రూ.1,21,600కోట్లకు చేరుకుంది