విశాఖ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.
పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసంగా పేర్కొన్నది కాస్తా 2023
2027కు అది అదానీ వికాసంగా మారిపోయింది.
అంతర్జాతీయ అనుభవాలను, భారత ప్రభుత్వ విధానాలను పరిగణలోకి తీసుకొని ఈ విధానాన్ని రూపొందించామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. చిన్న, మధ్యతరగతి, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో 2020లో రూపొందించుకున్న విధానం లక్ష్యాలను చేరుకున్నాదా? లేదా? అన్న విషయం ఇందులో ప్రస్తావించలేదు.
ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో పరిశ్రమల స్థాపనలో 4వ స్థానం, ఉత్పత్తిలో దేశంలో 7వ స్థానం సాధించామని డప్పుకొడుతున్న ప్రభుత్వం నాలుగేళ్లలో కల్పించిన ఉపాధి గురించి మౌనం వహిస్తున్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో యజమానుల ప్రయోజనాలు తప్ప, కార్మికుల గురించి ప్రస్తావన కూడా ఉండటం లేదు. ఏప్రిల్ 20232027 వరకు 4 సం॥రాలకు గాను రూపొందించిన పారిశ్రామిక విధానంలోనూ ఇదే వైఖరి గోచరిస్తుంది. నూతన విధానంలో రోడ్డు రవాణా వాడకాన్ని తగ్గించి, జలరవాణాను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ మార్పుకు కారణం కేంద్ర ప్రభుత్వ సూచనలే అంటున్నారు. రాష్ట్రంలో 974 కి.మీ. మేర సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తిగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. 48 వేల ఎకరాలలో పోర్టు ఆధారిత పరిశ్రమల నిర్మాణం సాగుతుందని ప్రకటించారు. 974 కి.మీ. పరిధిలోని తీరప్రాంతంలో ఇప్పటికే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, రోడ్డు రవాణా, రైలు మార్గాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీలకు అప్పగించింది.ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న 48వేల ఎకరాలు పూర్తిగా అదానీ చేతుల్లోకి వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేసినట్టుగా స్పష్టమవుతున్నది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అదానీప్రదేశ్గా మారిందన్న విమర్శలు ఉన్నాయి. హిండెన్ బర్గ్ నివేదికతో దేశంలో భ్రష్టు పట్టిపోయిన అదానీకి రాష్ట్ర ప్రభుత్వం ఏ సంశయం లేకుండా అదానీకి భూములు, ప్రభుత్వ వనరులు కట్టబెట్టాలనుకోవటం పరిశీలకులకు ఆశ్చర్యం కల్గిస్తున్నది. 974 కి.మీ. తీరప్రాంతమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ 1555 కి.మీ.మేర జలరవాణాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రూ. 60 కోట్లు కేటాయించింది. దీని నిర్వహణకు 8 మందితో బోర్డును ఏర్పాటు చేసింది. దేశంలో 6100 కి.మీ. మేర పొడవైన తీరప్రాంతం ఉండగా ఒక్క ఏపిలోనే వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతాన్ని అదానీకి కట్టబెడుతున్నారు. విశాఖ
చైన్నయ్, బెంగుళూరు` చెన్నయ్ పారిశ్రామిక జోన్లలో 14 రంగాలకు తొలి ప్రాధాన్యతలో అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల స్థాపనకు సహకారం అందిస్తామని, నూతన విధానంలో ప్రైవేటు పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయనున్నామని ప్రభుత్వం చెప్పింది.
ప్రైవేట్ పారిశ్రామిక వాడలు పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్తో ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. అభివృద్ధి పరచిన పారిశ్రామిక పార్కులు, పట్టణ మౌలిక సౌకర్యాలు, లాజిస్టిక్ హబ్స్, ప్రపంచ స్థాయి పారిశ్రామిక టౌన్షిప్లు ఏర్పాటు చేయటం లక్ష్యంగా ఉంటుందని నూతన విధానంలో చెప్పారు.
రూ.200కోట్లు పెట్టుబడులు పెట్టగలిగిన పారిశ్రామిక వేత్తలకు పారిశ్రామిక వాడలలో వందలకొద్ది ఎకరాలు కేటాయిస్తారు. ఇందులో 33 శాతం నివాస అవసరాలకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బార్లా తలుపులు తెరిచారు.
ప్రభుత్వం ఎంతో గొప్పదిగా చెప్పుకుంటున్న ఈ విధానంలో కార్మికుల గురించి, వారి బాగోగుల గురించి ప్రస్తావన లేదు. పారిశ్రామిక శాంతి తమ రాష్ట్రంలో ఉన్నదని, నైపుణ్యమైన మానవ వనరులు కల్గిన రాష్ట్రంగా ప్రకటించుకున్నారు. యజమానులకు అనుమతులు వేగంగా రావటానికి వైఎస్ఆర్ఎపి1 అనే యాప్ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి 96 క్లియరెన్స్లను 21 రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి హామీనిచ్చారు. ఏతా, వాతా ఈ విధానం అదానీ, పరిశ్రమల యజమానుల అనుకూల విధానంగా భావించవచ్చు.
అదానీ అనుకూల విధానం
RELATED ARTICLES