దేశంలో 2021జనవరిలో కరోనా టీకాలు వేయడం ప్రారంభించారు. ఈ టీకాల పట్ల ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. వీటిని నివృత్తి చేయాల్సిన ప్రభుత్వం దానిపై శ్రద్ద పెట్టలేదు. అందుకే మొదటి దశలో వైద్య,ఆరోగ్య సిబ్బందితో సహా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు టీకాలు వేస్తున్న సందర్భంగా వత్తిడి చేసి టీకాలు వేయాల్సి వచ్చింది.ఇక సాధారణ ప్రజలు, పెద్దగా చదువుసంధ్యలు లేనివారి విషయం చెప్పనక్కరలేదు
తమ లాభాలే పరమావధిగా భావించే టీకాలు ఉత్పత్తి చేసే కంపెనీలు దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్పత్తి చేసిన టీకాలు ఇతర దేశాలకు ఎగుమతి చేసి డబ్బు దండుకున్నాయి. కంపెనీలకు అండగా నిలిచే కేంద్రప్రభుత్వ వైఖరి ఇందుకు తోడ్పడింది
ఏప్రిల్ నెలలో దేశంలో కరోనా రెండవ అల అతి తీవ్రంగా ప్రారంభం కావడంతో ప్రజల్లో టీకాకోసం వత్తిడి మొదలైంది. అప్పుడు కూడా కేంద్రప్రభుత్వం కంపెనీల లాభాలకుతోడ్పడే పద్దతిలో టీకా విధానం ప్రకటించింది. దేశంలో ఏ టీకాలు అయినా కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసే విధానం స్థానంలో కొంతమేరకు సబ్సిడీ ధరకు కేంద్రప్రభుత్వం కంపెనీలనుండి కొనుగోలు చేసేందుకు, అత్యధిక భాగం అధిక ధరలకు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలకు టీకా కంపెనీలు అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చింది. దీన్ని దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, అత్యధిక ప్రజానీకం వ్యతిరేకించినా కేంద్రప్రభుత్వ విధానంలో మార్పులేదు.
చివరికి సుప్రీం కోర్టు జోక్యంతో కేంద్రప్రభుత్వం “సార్వత్రిక ఉచిత టీకా కార్యక్రమం” ప్రకటించింది
దేశంలో టీకా కార్యక్రమం విజయవంతం చేసేందుకు దిగువ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లు, ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బంది, అధికారులు రేయింబవళ్లు అవిశ్రాంతంగా శ్రమించారు. సెలవు రోజుల్లోనూ మెగా వ్యాక్సిన్ క్యాంపు లు నిర్వహించారు. ఆస్పత్రుల్లోనే కాకుండా జనం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి, వారికి నచ్చచెప్పి వ్యాక్సిన్ కార్యక్రమం జయప్రదం చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి.
ఇంతటితో టీకా కార్యక్రమం పూర్తి అయినట్లు కాదు, కరోనా ప్రమాదం తొలగినట్లు కాదు. కనీసం దేశంలోని 50 శాతం మందికి పైగా ప్రజలకు రెండు టీకాలు పూర్తి చేస్తేనే కొంతైనా భరోసాతో ఉండగలం. అంటే కనీసం మరో 50 కోట్ల డోసుల టీకాలు అత్యవసరంగా వేయాల్సిందే, కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే సుమా
వై.నేతాజీ, గుంటూరు.