ఎంప్లాయీస్ వాయిస్ : ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా రొంగల అప్పలరాజు, ప్రధాన కార్యదర్శిగా కరి పార్థసారథి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన పాలేల రామాంజనేయులు గౌరవాధ్యక్షుడిగా.. ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్ గౌరవ సలహాదారుగా నియమితులయ్యారు. సోమవారం విజయవాడలో ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రచార కమిటీ ఛైర్మన్గా గంట శ్రీనివాసరావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా కరిమి రాజేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా గురాన శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలిగా శైలజారాణి ఎన్నికయ్యారు.
డిసెంబరు 10న ఆందోళన
సీపీఎస్ను రద్దు చేయాలనే డిమాండ్తో డిసెంబరు 10న ‘హక్కుల సాధన పోరు’ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆందోళన చేస్తున్నట్లు నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, పార్థసారథి తెలిపారు. సీపీఎస్ను రద్దు చేస్తామంటూ ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలని.. లేని పక్షంలో ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.