ఆలయాలు, మత సంస్థలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదు
వర్తింపజేస్తే ఇతర మతస్తులు రావొచ్చు
ఆ మతం ఆచరించనివారిని నియమించరాదని చట్టం చెబుతోంది
హైకోర్టు స్పష్టీకరణ.. దేవదాయ కమిషనర్ మెమో రద్దు.
దేవాలయాలు, ఇతర మత సంస్థల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పూర్తిస్థాయిలో వర్తించదని హైకోర్టు కీలక తీర్పుఇచ్చింది. దీనిని సంపూర్ణంగా వర్తింపజేస్తే. ఒక మతాన్ని ఆచరించనివారు కూడా ఇంకో మత ఆలయాల్లో ఉద్యోగులుగా నియమితుల య్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఏపీ దేవాలయ చట్టంలోని 13, 23, 29(3), 35 సెక్షన్ల ప్రకారం హిందూ మతం ఆచరించనివారిని ఆలయాల్లో ఉద్యోగులుగా నియమించరాదని గుర్తు చేసింది. రిజర్వేషన్కు సంబంధించి జీవోలు, సర్క్యులర్లను వర్తింపజేయడానికి దేవాలయాలు, హిందూ సంస్థలు ప్రభుత్వానికి చెందినవి కాదని పేర్కొంది. వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్(ఏపీసీవోఎస్) పరిధిలోకి తీసుకురావడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
ఏపీసీవోఎస్ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకోవాలని దేవాలయాల ఈవోలను ఆదేశిస్తూ దేవదాయ కమిషనర్ గత ఏడాది జూలై 29న ఇచ్చిన మెమోను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఆర్.రఘునందనరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. సదరు మెమోను సవాల్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన న్యాయవాది శ్యాంప్రకాశ్ ముఖర్జీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వి.వేణుగోపాలరావు, దేవదాయ శాఖ తరఫునప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.