Site icon Employees Voice

యూనివర్సిటీలలోని కాంట్రాక్ట్ అధ్యాప‌కుల‌కు కనీస మూలవేతనం ఇవ్వాల‌ని విన‌తి

యూనివ‌ర్శిటీల‌లో పని చేస్తున్న అధ్యాప‌కుల‌కు, నాన్ టీచింగ్ సిబ్బందికి మూల‌వేత‌నం ఇవ్వాల‌ని కోరుతూ సోమ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి రాష్ట్ర ఛైర్మెన్ ఎ.వి నాగేశ్వ‌ర‌రావు, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఎం. బాల‌కాశి, వైస్ ఛైర్మెన్ ఎస్‌.నూర్‌మ‌హ‌మ్మ‌ద్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి విన‌తిప‌త్రం మెయిల్ ద్వారా పంపారు.

    రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యావ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఇస్త్తూ నాడు`నేడు, వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్దలాంటి పధకాల ద్వారా విద్యార్ధుల భవిష్యత్‌కు ఎంతో కృషి చేస్తూ, మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నది. మౌలిక సదుపాయాలతో పాటు విద్యాలయాల్లో ఆచార్యులు,అధ్యాపకులు, ఉపాధ్యాయులు కూడా చాలా కీలకం అన్న విషయం మీకు తెలియనదికాదు.  కాని ప్రస్తుతం యునివర్సిటీలతో సహా ప్రభుత్వ విద్యాలయాలు కాంట్రాక్టు వ్యవస్థ మీదే ఆధారపడి ఉన్నాయి. దీనిని కూడా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
గతపాలకులు యూనివర్సిటీల్లో కూడా కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టారు. కాంట్రాక్ట్‌ టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ ఉద్యోగులచే యునివర్సిటీలలో అతి తక్కువ వేతనాలతో పనిచేయిస్తున్నారు. వీరికి కనీసం మూలవేతనం కూడా అమలు చేయడంలేదు. ఎంతో ఉన్నత చదువులు చదివిన వారితో గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో  తక్కువ వేతనాలతో పనిచేయించుకోవడం అన్యాయమే కాక అవమానపరచడమే. ఇప్ప‌టికే డిగ్రీ, జూనియర్‌, పాలటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు, మూలవేతనం(మినిమం టైం స్కేల్‌)అమలౌతున్నది. దీని ప్రకారం విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులకు మూలవేతనం అమలు చేయాలని అధికారులు సిఫారసు చేసినప్పటికీ నేటికి అమలు చేయడంలేదు.
 యునివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బందికి మినిమం టైం స్కేల్‌ వర్తించేలా తగు చర్యలు చేపట్టల‌ని వారు కోరారు.