కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగ భద్రతపై అధికారులతో చర్చించిన తరువాత త్వరలోనే ప్రకటన చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. డిగ్రీ, జూనియర్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై ఆ యూనియన్ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో సోమవారం ఆయన చర్చలు జరిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై 2019 జులైలో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశామని, కరోనా వల్ల పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదన్నారు. ఉద్యోగ భద్రతకు తాము భరోసా ఇస్తామని, 2022 వరకు ఒప్పందం ఉందని తెలిపారు. ఈ లోపు ముఖ్యమంత్రితో చర్చించి తదుపరి విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. విద్యా వ్యవస్థలో ప్రైవేటు యాజమాన్యాల గుత్తాధిపత్యాన్ని లేకుండా చేసేందుకు కొన్ని సంస్కరణలు చేస్తున్నట్లు వివరించారు. ఎయిడెడ్ పోస్టుల ద్వారా ఎంతమంది వస్తున్నారో… ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఎటువంటి ఇబ్బందులు వస్తాయో సమగ్రంగా చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ కమిషనరు వి.రామకృష్ణ, యూనియన్ ప్రతినిధులు కె.శ్రీనివాస్ యాదవ్, బిజె గాంధీ, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
ధర్నా తాత్కాలిక వాయిదా : కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్
తమ సమస్యలపై మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన ధర్నాను తాత్కాలికంగా వాయిదావేస్తున్నట్లు ఎపి ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిజె గాంధీ వెల్లడించారు. కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీస్ క్రమబద్ధీకరిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీని తప్పకుండా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఎయిడెడ్ కళాశాలల లెక్చరర్ల సర్దుబాటు వల్ల ఏ ఒక్క కాంట్రాక్టు లెక్చరర్ ఉద్యోగం కోల్పోరని తెలిపినట్లు వివరించారు. మంత్రి మరోసారి తమతో చర్చలు నిర్వహించి తుది నిర్ణయం ప్రకటిస్తారని పేర్కొన్నారు.
ఉద్యోగుల భద్రతపై త్వరలోనే నిర్ణయం విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి.
RELATED ARTICLES