Thursday, April 25, 2024
Home ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిది కాదా..?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిది కాదా..?

ఏ నలుగురు ఉద్యోగులు ఒక చోట కూడిన తమ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడిన చందంగా తయారయ్యిందని వాపోస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నేడు నెలకొనివుంది.నిజమే మరి.. ఉద్యోగులు మాత్రం ఎన్నాళ్ళని ఎదురు చూడగలరు..? నెలా..! ఆరునెల్లా..! ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడ్డిగారు అధికారానికి వచ్చి రెండేళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ… వారి సమస్యలకు పరిష్కారం చూపే చర్యలు కనిపించడం లేదు. అలాంటప్పుడు
వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని ఓపిక పట్టగలరు..? ఎన్నికల పాదయాత్ర సందర్భంలో ఎన్నో వాగ్ధానాలు..! ఎన్నెన్నో హామీలు..! జగనన్నా..! అంటూ… ఎదురొచ్చిన ప్రతి బాధిత బృందానికి అలఓకగా వరాలిచ్చి పారేసిన తరువాత… వాళ్ళు ఆశగా ఎదరు చూడటంలో… తప్పు లేదు. వారి ఆశలు నెరవేర్చే చర్యలు కనపడనప్పుడు ఉద్యోగులు అసంతృప్తికి గురి కావడం, ఆవేదన వెళ్ళగక్కడం సహజ పరిణామం. బాబుగారి జమానాలో భంగపడిన ఉద్యోగులు జగనన్నకు సాదరంగా స్వాగతం పలికారు. తమ గోడు వినిపించి పరిష్కారం అర్థించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడన్న మక్కువతో అక్కున చేర్చుకుని అధికారం కట్టబెట్టడంలో ఉడతా సాయం అందించారు.. కాని వారి ఆశలకు ఆచరణ రూపం కనిపించలేదు.అందుకే ఈ మనస్థాపం.
మన ప్రభుత్వం అధికారం చేపడితే…కరువు భత్యానికి ఇక వాయిదాల జిడ్డు వుండబోదని, కాలదోషం పట్టకుండా వేతన సవరణ (11వ పీఆర్సీ) మంజూరు చేసి… ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని జగన్మోహన్‌ రెడ్డి గారు ప్రకటించినప్పుడు
ఉద్యోగులు ఎగిరి గంతులేసారు. పదవీ విరమణ అనంతరం
ఉద్యోగుల కటుంబ భద్రతకు గుదిబండగా తయారైన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్‌)ను అధికారానికి వచ్చిన వారం రోజుల్లోనే రద్దుల పద్దులో కలిపేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీ కరణ చేసి తీరుతామని ఢంకా బజాయించి మరీ చెప్పారు.ఆధునిక బానిసత్వానికి అసలు సిసలు నమూనాగా నిలిచిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ వ్యవస్థకు చెల్లు చీటీ పలుకుతామని… బండ చాకిరీ బతుకుల్లో కొత్త వెలుగు నింపుతామని ప్రకటించి జగన్మోహన్‌ రెడ్డి గారు
ఉద్యోగుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసారు. వీడియో కాన్ఫరెన్సులు సమీక్షా సమావేశాల పేరుతో అర్థ రాత్రి అపరాత్రి అనకుండా పరుగులెత్తించే అధికారుల జులుం ఇకపై ఉండబోదని.. పని వేళలు కచ్చితంగా పాటించి తీరుతామని.. ప్రతి ఉద్యోగి సాయంత్రానికి ఇంటికి చేరి భార్యా బిడ్డలతో సంతోషంగా గడిపే రోజులు తీసుకు వస్తామని, ప్రతి ఏటా జనవరి ఒకటిన జాబ్‌ కేలండర్‌ విడుదల చేసి, ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గిస్తామని, మీడియా సాక్షిగా హామీ ఇచ్చారు.
ఉద్యోగులు కోరుకున్న విధంగా జగన్మోహన్‌ రెడ్డి గారికి ప్రజల ఆమోదం లభించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ప్రభుత్వం కొలువు తీరింది. మొదటిసారి రాష్ట్ర సచివాల యంలో అడుగు పెట్టిన సందర్బంగా ఉద్యోగ సంఘాలన్నీ ముఖ్యమంత్రికి ఎదురేగి ఘన స్వాగతం పలికాయి. ఆ సందర్భంగా ఆయనకు ఉద్యోగ సంఘాల నాయకులు తిరిగి తమ గోడు వినిపిం చారు. సమస్యల చిట్టా అందించారు. అప్పుడు కూడా తన వాగ్ధానా లకు కట్టుబడే వుంటానని మడమ తిప్పే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు. ముఖ్య మంత్రి గారి ప్రకటన విన్న ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. కాని… నెలలు.. సంవత్సరాలు… గడిచిపోయినప్పటికీ ఉద్యోగుల ఆశలు మాత్రం నెరవేరలేదు.
పీఆర్సీ కోసం పడిగాపులు
2018 జూలై ఒకటితో 10వ పిఆర్సీ గడువు పూర్తయ్యింది. అనేక విజ్ఞప్తులు, వినతులు, నిరసనల తరువాత నాటి చంద్రబాబు ప్రభుత్వం 2018లో ఐ.ఏ.ఎస్‌ అధికారి అశుతోష్‌ మిశ్రా గారి అధ్యక్షతన నూతన వేతన సవరణ కమిటీని నియమించింది. సదరు కమిటీ దాదాపు రెండు సంవత్సరాల అధ్యయనం తరువాత 2020 అక్టోబర్‌ 5న ప్రస్తుత ప్రభుత్వానికి తన నివేదికను అందించింది. ఉద్యోగుల అవసరాలను గమనంలో పెట్టుకుని కొత్త పిఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చిన జగనన్న నివేదిక చేతికొచ్చి నెలలు గడుస్తున్నా…ఉలుకూ.. పలుకూ… లేకుండా తాత్సారం చేస్తున్నారు. ప్రభత్వం చేస్తున్న తాత్సారం వెనుక ఆంతర్యం ఏమిటో ఉద్యోగులకు అర్థం కాలేదు.
సరిగ్గా ఈ సమయంలోనే ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది. పిఆర్సీ కమిషనర్‌ అశుతోష్‌ మిశ్రా రెండేళ్లపాటు కసరత్తు చేసి అందించిన నివేదిక పై మళ్ళీ అధ్యయనం చేయాలంటూ మంత్రుల కమిటీని నియమించింది. సదరు కమిటీ ఏర్పడి కూడా నెలలు గడిచిపోతున్నది. కానీ దాని అతీ.. గతీ… ఏమైందో నేటికీ తెలియని పరిస్థితి. ఫలితంగా 2018 జూలై నుండి అమలు కావలసిన వేతన సవరణ నేటికి కూడా అందని ద్రాక్షలా ఊరిస్తూనే వుంది. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగవలసిన వేతన సవరణ ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా అమలు కాకపోవడం వలన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరిగిన ధరల భారాలన్ని , మారిన జీవిత అవసరాలను పాత జీతాలతో సరిపెట్టుకోలేక ఉద్యోగులు సతమతం అవుతున్నారు. ఉద్ధరిస్తుందనుకున్న ప్రభుత్వం ఉసురు తీస్తుంటే…
కక్కలేక మింగలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐదేళ్లకు ఒక సారి వేతన సవరణ అమలు హక్కును ఉద్యోగులు పోరాడి సాధించుకున్నారు. ఇప్పుడు ఆ హక్కు కాస్తా ప్రభుత్వం చేస్తున్న తాత్సారం కారణంగా నీరు కారిపోతున్నది.ఇది ఉద్యోగులకు వారి భవిష్యత్తుకు ప్రమాదకరం.
కరువు భత్యానికి కరువు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యానికి రాష్ట్రంలో కరువొచ్చింది. కరువు భత్యం చెల్లింపు విషయంలో… చంద్రన్న… జగనన్న… దొందూ… దొందేనని… ఉద్యోగులు భావిస్తున్నారు. 2018 జూలై నుండి 2019 జనవరి వరకు రెండు విడతల కరువు భత్యాన్ని బాబు ప్రభుత్వం పెండిరగ్‌లో పెట్టి దిగిపోయింది. 2019 జూలై నుండి 2021 జూలై వరకు మొత్తం ఐదు విడతల కరువు భత్యాన్ని జగనన్న ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కాగా 2018 జూలై నుండి 2019 జూలై వరకు మూడు విడతల కరువు భత్యాన్ని 2021 జనవరి నుండి 2022 జనవరి మధ్య మూడు వాయిదాల్లో చెల్లించనున్నట్టు ప్రభుత్వం 2020 నవంబరు 4న జీఓ 94ను విడుదల చేసింది. బకాయిలను రెగ్యులర్‌ ఉద్యోగులకు జిపిఎఫ్‌ లో జమ చేస్తామని, సిపిఎస్‌ ఉద్యోగులకు 10 శాతం సిపిఎస్‌ అకౌంట్‌కి జమ చేసి, మిగిలిన 90 శాతం నగదు రూపంలో చెల్లిస్తామని ప్రకటించింది. పింఛనుదారులకు కూడా విడతల వారీగా నగదు రూపంలో చెల్లిస్తామని చెప్పింది. కాని ఇప్పటి వరకు సిపిఎస్‌
ఉద్యోగులకు గాని… పింఛను దారులకు గాని.. నగదు చెల్లింపులు జరగనే లేదు. పింఛను దారులకైతే… జమ చేయని బకాయిల మీద ఆదాయం పన్ను వడ్డింపు కూడా జరిగిపోయింది. ఆ విధంగా 2018 జూలై లో చెల్లించవలసిన డిఏ… మూడేళ్ల తర్వాత అనగా.. 2021 జనవరి తర్వాత ఉద్యోగులకు చెల్లించారు. ఫలితంగా గడిచిన మూడేళ్లలో పెరిగిన ధరలకు సకాలంలో పరిహారం లభించక ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రనష్టానకి గురయ్యారు.
ఇది ఇలా వుండగా… కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ ఆర్థిక ఇబ్బందుల పేరు చెప్పి 2020 జనవరి నుండి 2021జనవరి వరకు ఒక ఏడాది పాటు తన ఉద్యోగులకు మూడు విడతల కరువు భత్యాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి వరంలా తోచింది. ఇంకేముంది..? కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తను కూడా వంతపాడుతూ… ఆదేశాలిచ్చేసింది. ఫలితంగా మూడు విడతల డిఏ అర్థాంతరంగా నిలిచిపోయింది. ఉద్యోగుల సంక్షేమానికి భరోసాగా వుంటానని హామీ ఇచ్చి అధికారానికి వచ్చిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వారిని సంక్షోభం లోనికి నెట్టేసి నమ్మక ద్రోహానికి పాల్పడిరది. అయితే.. సరిగ్గా… ఇక్కడే. తాజా పరిణామం ఒకటి ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం స్తంభింప చేసిన మూడు విడతల కరువు భత్యాన్ని 2021 జనవరి తర్వాత ఏకంగా ఒకే సారి విడుదల చేసింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే దారిని అనుసరించి తమ ఉద్యోగులకు ఉపశమనం కలిగించాయి. మరి జగనన్న ప్రభుత్వం ఏమి చేస్తుందో ! ఉద్యోగులు, వారి సంఘాలు ఏ మేరకు ప్రభుత్వం మీద వత్తిడి పెంచి నిలిపి వేసిన కరువు భత్యాన్ని తిరిగి సాధించుకుంటాయో… ! వేచి చూడాల్సిందే.
ఈ పరిణామాలన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే ! నూతన ఆర్థిక విధానాల అమలు దారిలో నడుస్తున్న నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు పోరాడి సాధించుకున్న కరువు భత్యం రాయితీని ఒక గుదిబండగా భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఏదో ఒక సాకు చూపి కరువు భత్యానికి ఎసరు పెట్టాలన్న కుయుక్తులు పన్నుతున్నట్టు వాటి కదలికలను బట్టి అర్థమవుతున్నది. కాబట్టి
ఉద్యోగులు వారి సంఘాలు అప్రమత్తత పాటించడం సంఘటిత ఉద్యమాలకు సిద్ధంగా వుండటం ఎంతైనా అవసరం.
పిల్లి మొగ్గలు వేస్తున్న సిపిఎస్‌ రద్దు హామీ
అధికారానికి వచ్చిన వారం రోజుల్లనే సిపిఎస్‌ అంతు చూస్తా నని నేటి ముఖ్య మంత్రి ఆ నాటి ప్రధాన ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్‌ రెడ్డి గారు పాద యాత్ర సందర్భంగా ప్రతిన పలికారు. ఇప్పుడు వారం కాదు… రెండేళ్లు దాటిపోయింది. పిల్లి మొగ్గలు తప్పా.. పరిష్కారం కనిపించడంలేదు. అదే పాదయాత్రలో కడప సమావేశంలో మాట్లాడినప్పుడు ఆయన మరో మాటన్‌ చెప్పారు. సిపిఎస్‌ రద్దు విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన వేసిన కమిటీలు కాలయాపనకి తప్పా మరెందుకూ పనికి రావని ఉద్యోగుల బాధలు ఆయనకు అర్థం కావని ఎద్దేవా చేసారు. కాని తన దాకా వస్తే… తగువే లేదన్న చందంగా… ఒక్క రాజకీయ నిర్ణయంతో తేలిపోయే సమస్య పరిష్కారానికి ఏకంగా మూడు కమిటీలు వేసి సమస్యను మురగబెడుతున్నారు. మొదట మంత్రుల కమిటీతో మంతనాలు జరిపారు. తదుపరి చీఫ్‌ సెక్రటరీ గారి నేతృత్వంలో వర్కింగ్‌ కమిటీ వేసారు. ఆ తర్వాత కె.ఎ.పండిట్‌ గారి అధ్యక్షతన కన్సల్టెన్సీని నియమించారు.ఇప్పటి వరకు ఈ కమిటీలన్నీ కనీసం కొండను తవ్వి ఎలుకనన్నా పట్టుకున్నాయో.. లేదో.. తెలియని పరిస్థితి. మరి దీన్ని కాలయాపన అనాలో.. కాచి వడపోస్తున్నారని భావించాలో.. ఉద్యోగులకు అర్థం కావడం లేదు. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినప్పుడు నేను చేయగలిగే హామీలనే ఇస్తానని చెప్పారు. మడమ తిప్పనని వక్కాణించారు. మరి వారం రోజుల్లో తేల్చి పారేస్తామని చేప్పిన సమస్యను సంవత్సరాలు దాటుతున్నా.. ఈ సాగదీసుడు దేనికో.. ఏలిన వారే శలవియ్యాలి.
ఎన్నికలకు ముందు మాట తప్పం.. మడమ తిప్పం… అన్నవారు నేడు మీన మేషాలు లెక్కపెట్టడం వెనక అంతరార్థం ఏమై వుంటుందో… తెలుసు కోవాలనుకోవడం ఉద్యోగుల ప్రాధమిక హక్కు. ముసుగులో గుద్దులాట మాని సిపిఎస్‌ రద్దు చేస్తామనో.. చెయ్యలేమనో.. ప్రభుత్వం స్పష్టం చేస్తే.. సంతోషించాలో.. చావో రేవో తేల్చు కోవాలో.. రాష్ట్రంలో గల 1,98,000 మంది సిపిఎస్‌
ఉద్యోగులు, వారి సకుటుంబ బంధు మిత్ర సపరివారం అంతా… తేల్చుకుంటుంది.
కాంట్రాక్టు ఉద్యోగుల ఆశల పై నీళ్లు
ఎన్నికల పాద యాత్ర సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన మరో హామీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ. ఇది కూడా టివీ సీరియల్‌ మాదిరిగా గత 18 ఏళ్ళుగా ఎడ తెగక సాగుతూనే వుంది. ఈ సమస్య పరిష్కారానికి కూడా అధికారులు మరియు మంత్రుల కమిటీలను ప్రభుత్వం నియమించింది. అరకొర చర్చలు కూడా జరిపింది.. కాని… వారి క్రమబద్దీకరణ హామీకి నేటికీ మోక్షం లభించలేదు. అర్హతలను అనుసరించి దశలవారీగా సాధ్యమైనంత ఎక్కువ మందిని పైకి లాగేస్తామని ముఖ్య మంత్రిగారు స్వయంగా పలు మార్లు ప్రకటించారు. కానీ అది నేటికీ కార్య రూపం దాల్చలేదు. పాపం.. కాంట్రాక్టు ఉద్యోగులు..! గత 18 ఏళ్ళుగా క్రమబద్దీకరణ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. మొదట్లో చంద్రబాబు, తర్వాత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, అనంతరం మళ్ళీ చంద్రబాబు, తాజాగా జగన్మోహన్‌ రెడ్డి ఇలా… అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్య మంత్రులు అందర్నీ వేడుకున్నారు. భద్రత కొరవడిన తమ బతుకుల్ని ఉద్ధరించమని వినతులు ఇచ్చారు. ఉద్యమాలు చేసారు. అయినప్పటికీ వారి బానిస బతుకులకు విముక్తి లభించలేదు. ఎన్నికలకు ముందు ప్రతి నేతా.. అరచేతిలో వైకుంఠం చూపించి, అధికారం అందనిచ్చి ఆవలకు నెట్టేసిన వాళ్ళే. వాళ్ళ బతుకు కరివేపాకు కంటే హీనమైపోయింది. కనీసం జగన్మోహన్‌ రెడ్డి గారైనా తమ బతుక్కి భద్రత సమకూర్చకపోరన్న ఆశతో ఇన్నాళ్లూ… వారు ఎదురుచూశారు. కాని జగనన్న ప్రభుత్వం కూడా తమ ఆశలకు సమాధి కట్టే ప్రయత్నంలోనే వుందని దాని నాన్పుడు వ్యవహారం గమనించిన ఎవరికైనా ఇట్టే…అర్థమైపోతుంది. ఇటీవలె ఇద్దరు కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్లు ఎటువంటి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ లేకుండానే రిటైరయిపోయారు కూడా. కాబట్టి కాంట్రాక్టు ఉద్యో గులకు ఇకనైనా అర్థం కావాలి. ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం వారు అనుసరిస్తున్న విధానాలు ఎవరిని ఉద్ధరించడానికి అన్నదే ముఖ్యం తెలుగుదేశం, కాంగ్రేస్‌, వైఎస్సార్‌ సీపీ పార్టీ ఏదైనా కావొచ్చు కాని అవి అనుసరిస్తున్న విధానాలు మాత్రం సేమ్‌ టు సేమ్‌. అని అర్థం చేసుకోవాలి. 18 ఏళ్ళుగా బానిస బతుకులు బతుకుతున్న వారి జీవితానుభవమే దీనికి పెద్ద సాక్ష్యం.
ఉద్యోగులు ప్రజల్లో భాగం
పార్టీ ఏదైనా.. పరిపాలిస్తున్నది ఎవరైనా.. ఉద్యోగులు ప్రజల్లో భాగమని ప్రభుత్వం గుర్తెరగాలి. ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగమే కావొచ్చు.. కాని అది విధి నిర్వహణ వరకు మాత్రమే. ప్రభుత్వ కార్యాలయం దాటిన తరువాత ప్రతి ఉద్యోగి బతుకు ప్రజా క్షేత్రంలో ప్రజల మధ్య పెనవేసుకుని ముందుకు సాగిపోవలసిందే. పాలకులు అమలు చేసే విధానాల ప్రభావం అది మంచైనా.. చెడైనా.. ప్రజల్లో భాగంగా జీవిస్తున్న ఉద్యోగులు కూడా భరించక తప్పదు. ప్రజా స్వామ్యంలో పాలకుల్ని ఎన్నుకునే హక్కు ప్రజలతో పాటు ఉద్యో గులకూ ఉంటుంది. తమ సంక్షేమాన్ని కాపాడతారన్న నమ్మకంతోనే ప్రజలైనా.. ఉద్యోగులైనా.. ఓట్లు వేసి తమకు నచ్చిన వారిని అధికార పీఠం ఎక్కిస్తారు. అటువంటప్పుడు ఎన్నికైన ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాలా..! వద్దా..? కాపాడటం ప్రభుత్వం బాధ్యత అయినప్పుడు వాళ్ళ సమస్యలను పట్టించుకుని సకాలంలో పరిష్కరించడం, వారి న్యాయమైన కోర్కెలను అవసరాలను అర్థం చేసుకొని ఆమోదించడం పాలకుల రాజ్యాంగ పరమైన కర్తవ్యమని వారికి ఎవరు గుర్తు చేయాలి..? పదవులు పొందడానికి, అందలాలు ఎక్కడానికి, ఉద్యోగుల ఓట్లు కావాలి..! వారి న్యాయమైన కోర్కెలు తీర్చాల్సి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మనుషుల్లా కనపడరు. తమ పదవులు ప్రజల భిక్షని గుర్తెరిగి ప్రవర్తించక పోవడం పాలకుల అహంకారానికి చిహ్నం. ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కాబట్టి వారు కుక్కిన పేనుల్లా పడివుండక తప్పదని అహంకరించిన ప్రభువులెవరూ పది కాలాలపాటు పరిపాలించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగుల్ని కలుపుకుంటే దాదాపు 10 లక్షల పైగానే వుంటారు. వారి బంధు మిత్ర సపరివారాన్నంతా కలుపుకుంటే వారిదేమీ చిన్నా.. చితకా.. సైన్యం కాదు. పాలకుల నుదుటి రాత మార్చడానికి ఈ సైన్యం చేవ సరిపోదని వారు భ్రమ పడితే ఫలితం చేదుగా ఉండక తప్పదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించు కోవాలి. ఉద్యోగుల కోర్కెలు కొత్తవి కాదు. వారి సమస్యల లోతు తెలుసుకొనే ఆనాడు మీరు హామీలు ఇచ్చారు. ఇప్పుడవి నెరవేర్చడం ప్రభుత్వం కనీస బాధ్యత.

– వి.రాజగోపాల్‌

RELATED ARTICLES

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...