గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి,
ప్రైవేటు సెక్టారులోని విభిన్న కర్మాగారాలలో రేయింబవళ్లు శ్రమించి, దేశాభివృద్ధిలో మావంతు పాత్ర నిర్వహించి పదవీవిరమణ పొందిన కార్మికులమైన మేము ఈ రోజున ఈపిఎస్–95 స్కీమ్ను అనుసరించి పొందుతున్న పెన్షన్ నామమాత్రం. ఈ 26 సంవత్సరాల సుదీర్ఘకాలంలో పెరుగుతున్న నిత్యావసరవస్తువుల ధరలకనుగుణంగా కరువుభత్యానికి నోచుకోక, 70 సంవత్సరాల పైబడిన వృద్ధులమైన మేము ఎంతో దయనీయ పరిస్థితులలో జీవనం సాగిన్తున్నాము. మాకు న్యాయం చేకూర్చాలని కోరుతూ మిమ్ములను ఆశ్రయిస్తున్నాము.
ఈపిఎస్–95 పథకం పరిధిలో దేశం మొత్తం మీద 65 లక్షలమందికి పైగా పెన్షనర్లం ఉన్నాము. వీరిలో దాదాపు 85 నుంచి 90 శాతం పెన్షనర్లకు కనీసంగా వెయ్యి రూపాయలు, గరిష్ఠంగా 3వేల రూపాయలు మాత్రమే లభిస్తున్నాయి. వీరంతా అతి తక్కువ వేతనంతో పదవీవిరమణ పొందినవారే.
ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన మొదట్లో మూడు సంవత్సరాల పాటు కార్మికులు పొందుతున్న పెన్షన్లలో 4 శాతం, 4.5 శాతం లెక్కించి డివిడెండు రూపంలో కలిపారు. ఆ తర్వాత ఆర్థికపరమైన అంశాలతో దానిని ముడిపెట్టి 2000 సంవత్సరంలో పూర్తిగా నిలిపివేశారు. 1971లో ప్రవేశపెట్టిన ఫ్యామిలీపెన్షన్ స్థానంలో 1995 నవంబర్ 16 నుంచి ఈపిఎస్–95 పథకాన్ని అమలుచేస్తున్నారు. కానీ 1971 నుంచి ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు పెన్షన్ను నిర్ధారించడానికి, 1971–1995 మధ్య పనిచేసిన కాలాన్ని పెన్షనబుల్ సర్వీసుగా పరిగణించలేదు. ఆ విధంగా కూడ మేము చాలా నష్టపోయాము. 2013లో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని సమీక్షించడానికి భగత్సింగ్ కోసియార్ కమిటీని నియమించింది. ఆ కమిటీ పథకాన్ని అధ్యయనం చేసి కనీస పింఛను 3వేల రూపాయలు చేసి దానికి కరవుభత్యాన్ని జోడించాలని ప్రభుత్వానికి నివేదించింది. దానికి అనువుగా ప్రభుత్వ ఫండ్ జమచేసే విభాగాన్ని 1.16శాతం నుంచి 8.33శాతం వరకు చెల్లించాల్సిందిగా సూచించింది. కోసియార్ కమిటీ నివేదికను యథాతథంగా అమలు చేసి ఉంటే ఈరోజున కనీస పెన్షన్ 9వేల రూపాయలు ఉండేది.
ఈ పథకాన్ని ప్రవేశపెట్టినపుడు ప్రభుత్వం పది సంవత్సరాలకొకసారి మూల్యాంకనలో వృద్ధి నమోదు చేస్తామని హామీ ఇచ్చింది. కాని ఆ దిశగా కూడా ఈపిఎఫ్ఓ దృష్టి పెట్టకపోవటంతో మాకు ఎంతో అన్యాయం జరిగింది. ఈపిఎస్–95 పథకంలో పూర్తిగా శాస్త్రీయత లోపించడంతో భవిష్యత్తు ప్రయోజనాలకు విఘాతం కలిగింది. కనీస అవసరాలు కూడా తీర్చలేని అరకొర పెన్షన్తో సాధారణమైన జీవనాన్ని సైతం గడపలేకపోతున్నాము. జీవిత చరమాంకంలో ఉన్న మా జీవనగమనాన్ని సమతుల్యం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ – డిఫైన్డ్ బెనిఫిట్ ఆధారంగా ఈపిఎఫ్ఓకు చెల్లిస్తున్న కాంట్రిబ్యూషన్కు తోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేక ఎదుగూ బొదుగు లేని పెన్షన్ అందుకొంటున్నాము. ఉద్యోగస్థులలో నెలకొన్న సందేహం తీర్చడానికి 1996 జనవరి 5న ఈపిఎఫ్ఓ అనేక వివరణలతో పత్రికా ప్రకటన ఇచ్చింది. అందులో భాగంగా హయ్యర్ పెన్షన్ సౌకర్యం, కమ్యుటేషన్, రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ సౌకర్యాన్ని ప్రకటించింది. వాటిని అదే ఏడాది మార్చి నుంచి గెజిట్ ప్రకటన ద్వారా అమలులోకి తెచ్చినది. పై ప్రకటన అధారంగా ఉన్నత న్యాయస్థానం 2003 నవంబర్ 12న ఈపిఎస్–95 అమలు సక్రమమేనని, ఉద్యోగస్థుని పదవీవిరమణ తర్వాత ఉపయోగకరంగా ఉంటుందని తన తీర్పులో పేర్కొంది. కాని ఆ తీర్పును ఈపిఎఫ్ఓ ఖాతరు చేయకుండా ధిక్కరించి హయ్యర్పెన్షన్ సౌకర్యాన్ని 2004 డిసెంబర్ 1 నుంచి నిలిపివేసింది. ఈ విషయాన్ని ఈపిఎఫ్ఓ 2016–17 వార్షిక నివేదికలో పేర్కొంది. మేము చెల్లిస్తున్న భవిష్యనిధి దేశాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్నప్పటికీ మాకు మాత్రం సరియైన ఆర్థిక భద్రత లేకుండా పోయినది. ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మాకు సాంఘికభద్రత కల్పించేవిధంగా న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము.
ఈపిఎస్–95 పెన్షనర్ల పక్షాన… భవదీయుడు
కొల్లిపర శ్రీనివాసరావు