ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు పెంచుతాం. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం …
… ఇవీ వైసీపీ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు
ఏపీ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల క్రితం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకిచ్చిన హామీలు నేటికీ అమలు చెయ్యలేదు. గత 3 పీఆర్సీల కాలంలో రెగ్యులర్ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేశాక, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ జీఓలను జారీ చేసింది. 8, 9 పీఆర్సీల కాలంలో నాటి రెగ్యులర్ ఉద్యోగుల మినిమం బేసిక్ను (మినిమం టైమ్ స్కేల్ను) కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపచేస్తూ జీఓలను నాటి ప్రభుత్వాలు జారీ చేశాయి. కాని దానికి భిన్నంగా 10వ పీఆర్సీ కాలంలో గత తెలుగుదేశ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను 3 స్లాబులుగా బేసిక్ను బట్టి విభజించి మినిమం టైమ్ స్కేల్ (కనీస బేసిక్) కన్నా తక్కువగా వేతనాలను పెంచుతూ జీఓ 151 జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులకు విడిగా పెర్సంటేజిగా వేతనాలు పెంచుతూ జీఓలు జారీ చేసింది. తద్వారా ఈ ఉద్యోగులకు అన్యాయం చేసింది. జరిగిన అన్యాయాన్ని వైసీపీ ప్రభుత్వం సరి చేస్తుందని ఎదురు చూస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశే మిగిల్చింది. కాంట్రాక్టు
ఉద్యోగులకు, మినిమం టైం స్కేల్ను కొన్ని విభాగాలకే వర్తింపచేస్తూ గత తెలుగుదేశ ప్రభుత్వం జీఓ జారీ చేసినా అది అమలుకు నోచుకోలేదు. దానినే ప్రస్తుత ప్రభుత్వం మరలా జీఓగా ఇటీవలె జారీ చేసింది. అయితే ఎస్.ఎస్.ఏ, ఎన్.హెచ్.ఎమ్.లోని స్టాఫ్నర్సు తదితర కేడర్లకు మరియు అనేక శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు నేటికీ మినిమం టైమ్ స్కేల్ అమలు కావడం లేదు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్టైమ్ కాంట్రాక్టు తదితర ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపచేయాల్సిన బాధ్యత, రెగ్యులర్ ఉద్యో గులతోపాటు పీఆర్సీ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉన్నది. దీని అమలుకై ఉద్యోగులందరూ ఐక్యంగా ముందుకు సాగాలి.
ఆదర్శ యజమానిగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో చట్టాలను అమలు చెయ్యకుండా దోషిలా నిలబడుతున్నది. కాంట్రాక్టు లేబర్ (అబాలిషన్ డ రెగ్యులేషన్) చట్టం 1970 ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు అమలు చెయ్యాలి. అంటే రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ మరియు లీవులు, జీపీఎఫ్, హెల్త్ కార్డులు తదితర అన్ని సౌకర్యాలు వర్తింపచెయ్యాలి. సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ 213 ఆఫ్ 2013లో ఇచ్చిన తీర్పు ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వారికి రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ను వేతనంగా చెల్లించాలి. కాంట్రాక్టు ఉద్యోగులకూ పీఎఫ్, ఈఎస్ఐ లను వర్తింపచేయాలి. ఇటీవలె ఇద్దరు కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండానే రిటైర్ అయిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు, ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా అన్యాయంగా వ్యవహరిస్తోంది.
పీఆర్సీ పై ఇటీవలె చర్చల్లో ఆర్థికశాఖ కార్యదర్శిగారు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు సేకరిస్తామని ప్రకటిం చారు. అంటే గత 20 సంవత్సరాలుగా పని చేయించు కోవడమే కాని, కనీసం వారి వివరాలు కూడా లేని స్థితిలో ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. నేడు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలం దించని ప్రభుత్వ కార్యాలయం/ఆఫీసు/ఆసుపత్రి/స్కూళ్ళు లేవు. కాని పాలకులు చట్టప్రకారం వారికి రావాల్సిన వేతనాలు, సౌకర్యాలు అమలు చేయడం లేదు. ఉద్యో గులందరూ ఒక త్రాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టక పోవడమే నేటి పరిస్థితికి కారణం.
కరోనా కాలంలోనూ వైద్య, ఆరోగ్యశాఖ మరియు ఇతర శాఖల్లో సేవలందించిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా సోకి దాదాపు 200 మంది 2021 ఏప్రిల్, మే నెలల్లో మరణించారు. వారి కుటుంబాలకు నేటికీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించలేదు. కరోనా సోకిన వందలాది మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల 14 రోజుల వేతనాలను కట్చేసి రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించింది. వైద్య, ఆరోగ్యశాఖలో రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే ఎక్స్గ్రేషియా నిర్ణయిస్తూ జీఓ జారీ చేసిన ప్రభుత్వం, ఆ శాఖలో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, హెల్త్ సెక్రటరీలు, ఆశాలకు ఎక్స్గ్రేషియా వర్తింపచేస్తూ జీఓ ఇవ్వకుండా దుర్మార్గపు యజమానిగా నిలబడిరది.
వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఐక్యంగా నిలబడాలి. సమాన పనికి సమాన వేతనం, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పీఆర్సీ, రెగ్యులరైజేషన్, ఎక్స్గ్రేషియా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర సమస్యల పరిష్కారానికై ఐక్య ఆందోళనలు చేపట్టాలి. కాంట్రాక్టు పేరిట, ఔట్సోర్సింగ్ పేరిట, వివిధ పథకాల పేరిట, నియమించిన విధానం పేరిట అనైక్యంగా ఉండటం 3 లక్షల మంది ఉద్యోగులకూ నష్టమని వారు గ్రహించాలి. ఐక్యం కావాలి. ఐక్య ఆందోళనలు చేపట్టాలి. పాలకులపై వత్తిడి తేవాలి. అప్పుడే వారు పూర్తిస్థాయి విజయాలు సాధించగలరు.
– ఏ.వి.నాగేశ్వరరావు