ఎంప్లాయీస్ వాయిస్ : మూడు దశాబ్ధాలుగా టైం స్కేల్ వర్కర్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అక్టోబర్ 9న బాపట్ల వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో గుంటూరు జిల్లా అధ్యక్షులు కందుల నిరంజన్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.
నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఒప్పంద ఉద్యోగులకు రెగ్యులర్ చేసే వరకూ ఇతర ఉద్యోగులతో పాటు సమానంగా వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ తీర్మానించిందని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో టైం స్కేల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఏళ్ల తరబడి విజ్ఞప్తి చేస్తున్నా యూనివర్సిటీ యాజమాన్యం స్పందించకపోవడం పట్ల రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుందన్నారు. సిబ్బంది విషయంలో యూనివర్సిటీ యాజమాన్యాలు తీరని ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులకు గ్రాట్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు.
సమావేశంలో టైం స్కేల్ వర్కర్ల రాష్ట్ర కమిటీ అధ్యక్షులు భాను ప్రసాద్, కార్యదర్శులు కోటేశ్వరరావు, నందీశ్వరరావు, సిపిఎం నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు, ఏజీ కాలేజ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సీహెచ్ బాబు, నాగయ్య, రమేష్, కరుణాకర్, తిరుమల రెడ్డి, రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుపతి, పులివెందుల, మడకశిర, నెల్లూరు, బాపట్ల ప్రాంతాల్లోని వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలు, వివిధ జిల్లాల్లోని పరిశోధన సంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.