లేదంటే ఉద్యోగుల ఆత్మహత్యలు చూస్తారు
సర్కారుకు ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం హెచ్చరిక
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: ఎమ్మెల్సీలు
ఎంప్లాయిస్ వాయిస్: కంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందేనని ఏపీసీపీఎస్ ఉద్యోగ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులు శనివారం గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని ధర్నా చౌక్లో ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగుల సం ఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీఎం దాస్, ఎం.రవికుమార్ మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన సీపీఎస్ ఉద్యోగులకు నెలకు రూ.1050 ఫించను వస్తే వారి కుటుంబాలు ఎలా బతకాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రైతులు, కార్మికులు ఆత్యహత్యలు మాత్రమే చూశారని, ఇకపై సీపీఎస్ ఉద్యోగుల ఆత్మహత్యలు కూడా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన మాట తప్పకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
లేకుంటే రాష్ట్రంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలతో ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ దీక్షకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, ఏపీటీఎఫ్ ఎమ్మెల్సీ రఘువర్మ, ఎస్టీయూ ఎమ్మె ల్సీ కత్తి నరసింహారెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు తదితరులు సంఘీ భావం తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి, పాతపెన్షన్ విధానం సాధనకు శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఫ్యాప్టో చైర్మన్ జోసఫ్ సుధీర్బాబు, యూటీఎఫ్ గౌరవాధ్యక్షులు బాబురెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.